
శాప్ ఛైర్మన్ రవినాయుడు ని, శాప్ ఎండీ భరణి ఐఎఎస్ ని కలిసిన ఎమ్మెల్యే
ఇండోర్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మించాలని విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు
అనంతపురము అర్బన్, ఆగష్టు 19: బహుజన వేదిక న్యూస్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో క్రీడల్ని, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఆయన శాప్ ఛైర్మన్ రవినాయుడు ని, శాప్ ఎండీ భరణి ఐఎఎస్ ని కలిశారు. నియోజకవర్గంలోని యువత మరియు క్రీడాకారుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు, వారికి మెరుగైన క్రీడా మౌలిక వసతులు, శిక్షణా సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఖేలో ఇండియా’ పథకం కింద అనంతపురము అర్బన్ నియోజకవర్గంలో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మరియు స్క్వాష్ కోర్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిపాదిత మల్టీపర్పస్ హాల్ మరియు స్క్వాష్ కోర్టు ద్వారా స్థానిక యువత, క్రీడాకారులు నిత్య శిక్షణ పొందడంతో పాటు వివిధ స్థాయి పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందన్నారు. అదేవిధంగా యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని, క్రమశిక్షణను, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో ఈ సదుపాయాలు ఎంతో దోహదపడతాయన్నారు. అర్బన్ నియోజకవర్గంలో అనువైన స్థలాన్ని గుర్తించి మల్టీపర్పస్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనను సిద్ధం చేసి… ఖేలో ఇండియా పథకం కింద అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. వీటిని నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై శాప్ ఛైర్మన్ రవినాయుడు సానుకూలంగా స్పందించారు. మల్టీపర్పస్ ఇండోర్ హాల్, స్క్వాష్ కోర్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.










