
- న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం ఆవేదన, ఆగ్రహం కలగలిసిన దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ హల్ద్వానీ ఘటనను ప్రస్తావిస్తూ తీవ్రంగా చలించిపోయారు.
“ఇది నాకు జరిగిన అవమానం కాదు, ఈ దేశ రాజ్యాంగానికి జరిగిన అవమానం” అంటూ ఖర్గే గొంతులో బాధ, కోపం కలగలిసిపోయాయి.
ఆగస్టు 8న హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తాను ప్రసంగించిన వేదికను తాను వెళ్లిన వెంటనే కొందరు దుండగులు గంగాజలంతో “శుద్ధి” చేశారన్న వార్తలను ఆయన సభ ముందు ఉంచారు.
“నా ప్రసంగం తర్వాత వేదికను శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అంటరానివాడినా? నా నీడ పడితే మైల పడుతుందా?” అని ఖర్గే ప్రశ్నించిన తీరు సభను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టింది.
“80 ఏళ్లు దాటిన నాకు, ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న నాకే ఈ పరిస్థితి ఎదురైతే, ఈ దేశంలో కోట్లాది మంది సామాన్య దళితుల పరిస్థితి ఏమిటి? స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లయినా ఇంకా మనం మనుషులను కులం పేరుతో అపవిత్రంగా చూస్తామా? ఇది ఎంతటి సిగ్గుచేటు!” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం తన వ్యక్తిగత అవమానం కాదని, ఈ దేశంలో ఇంకా బతికే ఉన్న కుల అహంకారానికి, మనువాద వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనపై సభలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, బీజేపీ ఇటువంటి నీచమైన చర్యలను ఎన్నటికీ సమర్థించదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ కూడా ఈ చర్యను ఖండించారు, ఇది ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి మచ్చ అని వ్యాఖ్యానిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాంగ్రెస్ వర్గాలు అంటున్నట్లు ఇది ఒక రాజకీయ వివాదం కాదు, మన ఆత్మను ప్రశ్నించుకోవాల్సిన సమయం. రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని ఇచ్చిన దేశంలో, ఒక దళిత నాయకుడు కూర్చున్న కుర్చీని, నిలబడిన వేదికను శుద్ధి చేసే దుర్మార్గపు ఆలోచన ఇంకా ఎలా బతికి ఉంది?రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు. కానీ ఒక మనిషి పుట్టుకను, సామాజిక నేపథ్యాన్ని అవమానించడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమే ప్రభుత్వం ఇప్పుడు విచారణకు హామీ ఇచ్చింది. నిజానిజాలు తేలాల్సి ఉంది. కానీ ఖర్గే సభలో లేవనెత్తిన ప్రశ్న మాత్రం ప్రతి భారతీయుడిని వెంటాడుతోంది – రాజ్యాంగం సమానత్వం ఇచ్చినా, మన మనసుల్లోని అంటరానితనపు మైల ఎప్పుడు వదులుతుంది








