
జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మత్తు కలిగించే మందుల విక్రయంపై సంయుక్త తనిఖీలు
జిల్లా కేంద్రంలోని భైరవనగర్లో మెడికల్ షాప్ సీజ్
యువతను గుల్ల చేస్తున్న ‘అల్ట్రాస్పాస్’ నిల్వలు గుర్తింపు
పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ మరియు ఈగల్ విభాగాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు
అనంపురము ఆగష్టు 19: బహుజన వేదిక న్యూస్
మత్తుకు బానిసలైన వ్యక్తులకు అక్రమంగా మత్తు కలిగించే మందులను విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో స్థానిక భైరవనగర్ ప్రాంతంలో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ, జిల్లా క్రైమ్ బ్రాంచ్ మరియు ఈగల్ విభాగం అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. బుధవారం భైరవనగర్లోని ‘దీక్షిత్ మెడికల్ & జనరల్ స్టోర్స్’పై దాడి చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో సాధారణంగా కడుపునొప్పి నివారణకు ఉపయోగించే ALTRASPAS అనే మందును సదరు షాపు నిర్వాహకులు అధిక పరిమాణంలో కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మందును మత్తు కోసం యువతకు విక్రయిస్తున్నట్లు అనుమానించిన బృందం.. కొనుగోలు, అమ్మకాల రికార్డులు, నిల్వ వివరాలను లోతుగా పరిశీలించి షాపును సీజ్ చేసింది.
ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఏడీ వీరకుమార్ రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్లు కేశవరెడ్డి, మాధవి, జిల్లా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి (ఈగల్ నోడల్ అధికారి), ఈగల్ విభాగం ఎస్ఐ హనుమంతు తమ సిబ్బందితో కలసి ఈ దాడిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మత్తు మందుల దుర్వినియోగం ద్వారా యువత జీవితాలు నాశనం కాకుండా అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తునిచ్చే ఔషధాలను విక్రయించే మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సదరు షాపు యాజమాన్యం నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశామని, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అక్రమ విక్రయాలపై పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ మరియు ఈగల్ విభాగాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.









